Telugu Global
Andhra Pradesh

భార్య‌పై అనుమానం.. బిడ్డ‌ను బ‌లితీసుకున్న ఉన్మాదం

గురువారం తెల్ల‌వారుతుండగానే ఓ చేతిలో వేటకొడవలి, మరో చేతిలో పురుగుమందు డబ్బా పట్టుకుని ఊగిపోతూ రాజు.. త‌న‌ భార్య ఉంటున్న ప్రాంతానికి వచ్చాడు.

భార్య‌పై అనుమానం.. బిడ్డ‌ను బ‌లితీసుకున్న ఉన్మాదం
X

భార్య‌పై అనుమానంతో ఉన్మాదిలా మారిన భ‌ర్త ఆ ఆవేశంలో త‌న కుమారుడినే బ‌లి తీసుకున్నాడు. అత‌డి తీరు చూసి ఆందోళ‌న‌కు గురైన భార్య, పెద్ద కుమారుడు దూరంగా వెళ్లిపోవ‌డంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడు కూడా పురుగుమందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. కర్నూలు జిల్లా దేవనకొండలో గురువారం ఈ ఘ‌ట‌న జరిగింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

బనగానపల్లి మండలం పెద్దరాజుపల్లి గ్రామానికి చెందిన అరసాని రాజు (44), అనిత 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు రావడంతో ఐదేళ్ల క్రిత‌మే అనిత పిల్ల‌లిద్ద‌రినీ తీసుకొని దేవ‌న‌కొండ‌లోని త‌ల్లి వ‌ద్ద‌కు వ‌చ్చేసింది. ఆమె ప్రైవేటు టీచ‌ర్‌గా ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

గురువారం తెల్ల‌వారుతుండగానే ఓ చేతిలో వేటకొడవలి, మరో చేతిలో పురుగుమందు డబ్బా పట్టుకుని ఊగిపోతూ రాజు.. త‌న‌ భార్య ఉంటున్న ప్రాంతానికి వచ్చాడు. అతడి తీరు చూసిన అనిత, పెద్ద కుమారుడు దూరంగా వెళ్లిపోయి తప్పించుకున్నారు. తీవ్ర ఉద్రేకంతో ఇంట్లోకి వెళ్లిన రాజుకు చిన్న కుమారుడు ఉజ్వల్ (4) నిద్ర‌పోతూ కనిపించాడు. కోపంతో ఆ చిన్నారికి బలవంతంగా పురుగు మందు తాగించాడు. కలిసి జీవిద్దామని త‌న భార్యకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని, వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని రోడ్డుపై అరుస్తూ.. పురుగుమందు తాగి కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని, చిన్నారిని ఆసుపత్రులకు తీసుకెళ్లినప్పటికీ.. ఇద్దరూ కొద్దిసేపటికే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  18 Aug 2023 2:36 AM GMT
Next Story