Telugu Global
Andhra Pradesh

వారసుడంటూ వెటకారం.. జగన్ ని రెచ్చగొడుతున్న షర్మిల

వైఎస్ఆర్ వారసుడిగా చెప్పుకునే జగన్ దగా డీఎస్సీ వేశారంటూ షర్మిల ట్వీట్ వేశారు. తాను ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేసే YCP నాయకులు, వాళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్.. అంటూ 9 ప్రశ్నలు సంధించారు.

వారసుడంటూ వెటకారం.. జగన్ ని రెచ్చగొడుతున్న షర్మిల
X

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల హడావిడి రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఎల్లో మీడియా ఇప్పుడామెను పెద్దగా పట్టించుకోవట్లేదు. అటు వైసీపీ నుంచి కూడా షర్మిల అనుకున్న స్థాయిలో రియాక్షన్ లేదు. సీఎం జగన్ నేరుగా స్పందించడంలేదు. మంత్రులు, సీనియర్ నేతలు మాత్రమే షర్మిలకి కౌంటర్లిస్తున్నారు. దీంతో షర్మిల కొత్త వ్యూహం మొదలు పెట్టారు. జగన్ ని రెచ్చగొడుతూ ట్వీట్లు వేస్తున్నారు. తాజాగా డీఎస్సీ నిర్వహణపై ఆమె ఘాటు ట్వీట్ వేశారు.

వారసుడిగా చెప్పుకునే జగన్..

వైఎస్ఆర్ అసలైన వారసులెవరనే విషయం అందరికీ తెలుసు. కాంగ్రెస్ ని ఎదిరించి నిలబడి, ఒంటరిపోరాటం చేసి, జైలుకి పంపించినా భయపడకుండా, తొలిసారి పార్టీ అధికారంలోకి రాకపోయినా నిరాశపడకుండా తాను అనుకున్నది సాధించిన జగన్ మహానేతకు అసలైన వారసుడు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని మరచిపోయి తిరిగి అదే పార్టీలో చేరి, వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపి, ఆయన్ను తిట్టినవారికి వంతపాడుతూ రాజకీయం చేస్తున్న షర్మిలను వైఎస్ఆర్ వారసురాలిగా ఎవరూ గుర్తించడంలేదు. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కావడంలేదు. నేరుగా జగన్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. వైఎస్ఆర్ వారసుడిగా చెప్పుకునే జగన్ దగా డీఎస్సీ వేశాడంటూ ఆమె తాజాగా ట్వీట్ వేశారు. తాను ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేసే YCP నాయకులు, వాళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్.. అంటూ 9 ప్రశ్నలు సంధించారు.


షర్మిల ట్వీట్ కు సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఉద్యోగాలంటే కేవలం టీచర్ పోస్ట్ లు ఒక్కటే కాదని, ఈ ఐదేళ్లలో జగన్ ఇచ్చిన ఉద్యోగాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. వారసుడు జగన్ అంటూ వెటకారంగా మాట్లాడటం సరికాదని.. వైఎస్ఆర్ అసలైన వారసుడు జగన్ మాత్రమేనని షర్మిలకు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ అభిమానులు.

తన విమర్శలకు నేరుగా జగన్ రియాక్ట్ కావాలని షర్మిల ఆశిస్తున్నారు. సీఎం జగన్ స్పందిస్తే ఏపీ రాజకీయాల్లో తాను మరింత హైలైట్ కావొచ్చనేది ఆమె ఆలోచన. కానీ జగన్ మాత్రం షర్మిల వ్యవహారాన్ని పూర్తిగా పక్కనపెట్టారు. కుటుంబాల్ని చీల్చి రాజకీయాలు చేస్తున్నారంటూ వైరి వర్గంపైనే జగన్ విమర్శలు చేస్తున్నారు. రాగా పోగా షర్మిలకు వైసీపీ నేతలు సమాధానమిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో షర్మిల ట్వీట్ కి అంతే ఘాటుగా కౌంటర్లు పడుతున్నాయి.

First Published:  14 Feb 2024 4:52 AM GMT
Next Story