Telugu Global
Andhra Pradesh

వైసీపీలో రెడ్లకు అన్యాయం.. లోకేష్ ఆవేదన

‘రెడ్డి సోదరులారా ఆలోచించాలి.. మీకు కనీస గౌరవం దక్కుతుందా?’ అని యువగళం యాత్రలో నారా లోకేష్ ప్రశ్నించారు. వైసీపీలో రెడ్లకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. రెడ్డి సోదరులు ఆలోచించాలన్నారు.

వైసీపీలో రెడ్లకు అన్యాయం.. లోకేష్ ఆవేదన
X

వైసీపీ హయాంలో రెడ్లకు సంతర్పణ జరుగుతోందని నిన్న మొన్నటి వరకు టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా గొడవ చేసేవి. తాజాగా నారా లోకేష్ ప్లేట్ ఫిరాయించారు. వైసీపీ హయాంలో రెడ్లకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ లోకేష్ ఆవేదనకు కారణం ఏంటి.. జగన్ తన సొంత సామాజిక వర్గాన్ని నిజంగానే పక్కనపెట్టారా..? పోనీ అలా పక్కనపెట్టడం వల్ల లోకేష్ కి వచ్చిన ఇబ్బంది ఏంటి..?

నా ప్రియమైన రెడ్డి సోదరులారా..!!

‘రెడ్డి సోదరులారా ఆలోచించాలి.. మీకు కనీస గౌరవం దక్కుతుందా? వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మినహా మిగతా రెడ్లు ఎవరైనా బాగుపడ్డారా’ అని యువగళం యాత్రలో నారా లోకేష్ ప్రశ్నించారు. వైసీపీలో రెడ్లకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. రెడ్డి సోదరులు ఆలోచించాలన్నారు.

జగన్ కి ఆస్కార్ ఖాయం..

ఆర్ఆర్ఆర్ సినిమాలో జగన్ నటించి ఉంటే కచ్చితంగా ఆయన నటనకు ఆస్కార్ అవార్డ్ వచ్చి ఉండేదని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా ఆడారని, దాన్ని టీడీపీ కుట్రగా ప్రచారం చేశారని, చివరకు ఎన్‌ఐఏ దర్యాప్తులో అది జగన్‌ డ్రామా గా తేలిందన్నారు లోకేష్. బాబాయ్‌ హత్యపై కూడా జగన్ మరో పెద్ద డ్రామా ఆడారన్నారు. ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారని నిలదీశారు. మైనారిటీలకు సంబంధించిన ఎన్నో పథకాలను జగన్ రద్దు చేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

పాదయాత్రలో ఉద్రిక్తత..

కర్నూరు జిల్లా తుగ్గలిలో నారా లోకేష్ యాత్ర కొనసాగుతున్న సమయంలో శభాష్‌ పురం వద్ద కొంతమంది నల్లజెండాలతో నిరసన తెలిపారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారంటూ లోకేష్ మండిపడ్డారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. పత్తికొండ నియోజకవర్గంలో తన పాదయాత్రలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని లోకేష్ ఆరోపించారు.

First Published:  16 April 2023 6:47 AM GMT
Next Story