Telugu Global
Andhra Pradesh

చట్టంపై గౌరవం ఉందట..

కొన్ని కేసుల్లో హైకోర్టు చల్లాబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చినా ఇంకా కొన్ని కేసుల్లో అరెస్టు అవకాశముంది. అన్నీ విషయాలను జాగ్రత్తగా లాయర్లతో సమీక్షించిన తర్వాతే వేరేదారిలేక చల్లాబాబు పోలీసులకు లొంగిపోయారు.

చట్టంపై గౌరవం ఉందట..
X

చట్టంపై గౌరవంతోనే తాను లొంగిపోయినట్లు చల్లా రామచంద్రారెడ్డి (చల్లాబాబు) చెప్పారు. నెల రోజుల క్రితం పుంగనూరు సమీపంలోని అంగళ్ళు ప్రాంతంలో చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన గొడవలు గుర్తుంది కదా.. అందులో ప్రధాన నిందితుడు, ఏ1 గా పోలీసు కేసులు ఎదుర్కొంటున్న టీడీపీ నేతే చల్లాబాబు. రాబోయే ఎన్నికల్లో పుంగనూరులో టీడీపీ అభ్యర్థి కూడా. చల్లా మీద పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. అన్నింటిలోనూ చల్లాబాబు ఏ1 నిందితుడే. అల్లర్లు జరిగిన తర్వాత మాయమైపోయి నెలరోజులు పోలీసుల నుంచి తప్పించుకుని ఎక్కడెక్కడో తిరిగారు.

కొన్ని కేసుల్లో హైకోర్టు చల్లాబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చినా ఇంకా కొన్ని కేసుల్లో అరెస్టు అవకాశముంది. అన్నీ విషయాలను జాగ్రత్తగా లాయర్లతో సమీక్షించిన తర్వాతే వేరేదారిలేక చల్లాబాబు పోలీసులకు లొంగిపోయారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చల్లా తన మొబైల్ ఫోన్లను మార్చారు, సిమ్ కార్డులను ఛేంజ్ చేశారు. మకాంను మారుస్తున్నా.. ఏదో రూపంలో పోలీసులు కనుక్కుని అరెస్టుకు ప్రయత్నిస్తునే ఉన్నారు. ఇక ఎక్కువ రోజులు తప్పించుకొని తిరగటం కష్టమని అర్థ‌మైపోయినట్లుంది. ఇప్పటికే కుటుంబానికి, నియోజకవర్గానికి దూరంగా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు.

అందుకనే వేరేదారిలేక లాయర్లతో వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు. ప్లాన్‌ ప్రకారమే పోలీసులపై దాడులు చేసి, పోలీసులను తీవ్రంగా గాయపరిచి, పోలీసులు వాహనాలకు నిప్పుపెట్టడంలో చల్లాబాబుదే కీలకపాత్రగా పోలీసులు ఇప్పటికే కోర్టులో వివరించారు. ఇందుకు సంబంధించిన అన్నీ ఆధారాలను కోర్టుకు అందించారు. నెల రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతూ చివరకు వేరేదారిలేక లొంగిపోయారు. అలాంటిది చట్టంపైన గౌరవంతోనే లొంగిపోయినట్లు ప్రకటించటమే పెద్ద జోక్.

ఇప్పటికే చల్లాపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ కేసులన్నింటినీ తవ్వితీసిన పోలీసులు చల్లా నేరచరిత్రను కోర్టుకు సమర్పించారు. అంగళ్ళు ఘర్షణలో కేసులు ఎదుర్కొంటున్న తెలుగు దేశం పార్టీ తమ్ముళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా పోలీసుల నుంచి తప్పించుకునే తిరుగుతున్నారు. విషయం ఏమిటంటే.. చల్లాబాబుతో పాటు మరికొందరు రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోతున్నారు. నరహరి, కిషోర్ కుమార్ రెడ్డి, నాని లాంటి అభ్యర్థులు కూడా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కుటుంబాలను, నియోజకవర్గాలను వదిలేసి, పోలీసులను తప్పించుకుని ఎంతకాలం తిరుగుతారో చూడాల్సిందే.

*

First Published:  5 Sep 2023 6:04 AM GMT
Next Story