Telugu Global
Andhra Pradesh

జగన్ కు ప్రాణ హాని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ

ఇటీవల అమిత్ షా వ్యాఖ్యల్ని డీప్ ఫేక్ చేశారంటూ ఏకంగా పోలీస్ కేసులు పెట్టి పెద్ద రచ్చ చేశారని, వీడియో విషయంలోనే అంతగా స్పందించిన కేంద్రం, చంద్రబాబు వ్యాఖ్యల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు పోసాని.

జగన్ కు ప్రాణ హాని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ
X

ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడని, ఈ యుగంలో చంద్రబాబు రాక్షసుడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి. 'జగన్‌మోహన్‌రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది..' అంటూ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు పోసాని కౌంటర్ ఇచ్చారు. అలాంటి వ్యాఖ్యలపై కనీసం కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏదైనా చేస్తా అన్నట్టుగా చంద్రబాబు వ్యవహారం ఉందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను రాష్ట్రపతి కానీ, ప్రధాని కానీ, కేంద్ర హోం మంత్రి కానీ వినలేదా అని ప్రశ్నించారు పోసాని.

సీజేఐకి లేఖ రాస్తా..

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోడానికి లేదని, జగన్ కి నిజంగానే ప్రాణ హాని ఉందంటున్నారు పోసాని కృష్ణ మురళి. అందుకే తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని చెప్పారు. ఏపీకి ఒకరోజు వచ్చి, ఇక్కడ తిరిగి పరిస్థితి చూడాలని ఆ లేఖలో తాను సీజేఐని కోరబోతున్నట్టు చెప్పారు. వైఎస్ జగన్ ని కాపాడాలంటూ ఆ లేఖలో తాను సీజేఐకి విన్నవిస్తానంటున్నారు పోసాని.

ఇటీవల అమిత్ షా వ్యాఖ్యల్ని డీప్ ఫేక్ చేశారంటూ ఏకంగా పోలీస్ కేసులు పెట్టి పెద్ద రచ్చ చేశారని, వీడియో విషయంలోనే అంతగా స్పందించిన కేంద్రం, చంద్రబాబు వ్యాఖ్యల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు పోసాని. భారత దేశంలో నెంబర్-1 డాన్ చంద్రబాబు అని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. బీజేపీలో చేరితే.. ఎవరు ఏం చేసినా నడుస్తుందా? చేసిన అవినీతి కూడా కనిపించదా? అని ప్రశ్నించారు పోసాని.

First Published:  1 May 2024 7:30 AM GMT
Next Story