Telugu Global
Andhra Pradesh

పవన్ డేంజరస్ గేమ్ ఆడుతున్నారా?

ఐదురోజులు వరుసగా కాపులను రెచ్చగొట్టిన పవన్ సడెన్‌గా కాకినాడలో ముస్లింలతో సమావేశమయ్యారు. మీటింగ్‌లో మాట్లాడుతూ.. ముస్లింలను జగన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం మొదలుపెట్టారు.

పవన్ డేంజరస్ గేమ్ ఆడుతున్నారా?
X

ఎన్నికలు దగ్గరకు వస్తున్నకొద్దీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డేంజరస్ గేమ్‌కు తెరలేపారు. ఇంతకీ పవన్ ఆడుతున్న డేంజరస్ గేమ్ ఏమిటంటే కులాలను, మతాలను బాగా రెచ్చగొట్టడం. మతానికి మించిన మత్తు మరోటిలేదనే నానుడి అందరికీ తెలిసిందే. ఇంతకాలం బీజేపీ మతాన్ని ప్రయోగించే ఎదిగింది. ఎంతైనా మిత్రపక్షం కదా దాన్నిచూసి పవన్ కూడా అదే పని చేస్తున్నట్లున్నారు. అయితే అచ్చంగా మతాన్ని ప్రయోగిస్తే ఏమన్నా అనుకుంటారేమో అని ముందుగా కాపులని ఇప్పుడు ముస్లింలంటున్నారు.

వారాహి యాత్రలో ఐదు రోజులు కాపులను బాగా రెచ్చగొట్టారు. కాపులకు జనసేన పెద్దన్నలా వ్యవహరిస్తుందన్నారు. కాపులు కులభావ‌న‌తో ఉండాలన్నారు. జనసేనను ఆదిరించి తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చేట్లుగా చేయమని బతిమలాడుకుంటున్నారు. కాపులకు అన్యాయం చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్‌కు వ్యతిరేకంగా పదేపదే కాపులను రెచ్చగొడుతున్నారు. కాపులను మోసం చేసిన చంద్రబాబునాయుడు గురించి మాత్రం ఎక్కడా ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు.

ఐదురోజులు వరుసగా కాపులను రెచ్చగొట్టిన పవన్ సడెన్‌గా కాకినాడలో ముస్లింలతో సమావేశమయ్యారు. మీటింగ్‌లో మాట్లాడుతూ.. ముస్లింలను జగన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. జగన్ క్రిస్టియ‌న్‌ కాబట్టి ముస్లింలకు ఏదో చేస్తారని మోసపోవద్దన్నారు. తాను బీజేపీకి మిత్రపక్షం కాబట్టి ముస్లింలకు వ్యతిరేకమని అనుకోవద్దని చెప్పారు. వైసీపీని వదిలిపెట్టి జనసేనకు మద్దతుగా నిలవమని ముస్లింలకు పవన్ విజ్ఞప్తి చేశారు. ముస్లింలతో పవన్ మీటింగ్ చూస్తుంటే వెనుకనుండి చంద్రబాబే డైరెక్షన్ చేస్తున్నట్లుంది.

ఇక్కడ పవన్ మరచిపోయిన విషయం ఏమిటంటే క్రిస్టియ‌న్‌ కాబట్టి ముస్లింలు జగన్‌తో లేరు. అలాగే కాపులను మాయచేసి జగన్ తనతో ఉంచుకోలేదు. తమకు మంచి చేస్తాడన్న నమ్మకంతోనే ముస్లింలు జగన్‌తో ఉన్నారు. నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకుంటున్నారు. గడచిన రెండు ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థులందరూ గెలిచారు. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఇక కాపుల విషయం చూస్తే పోయిన ఎన్నికల్లో 30 మంది కాపులకు జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 27 మంది గెలిచారు. ఒకపార్టీ తరపున 30 మంది కాపులకు గతంలో ఎవరూ సీట్లు ఇవ్వ‌లేదు. తర్వాత మంత్రివర్గంలో కూడా ప్రాధాన్యతిచ్చారు. బీసీలు, ముస్లింలు, కాపులు, ఎస్సీల కోసం మాటలు చెప్పటం కాకుండా చేతల్లో చూపుతున్నారు కాబట్టే పై వర్గాలు జగన్‌కు మద్దతుగా నిలిచాయి. మరి మీటింగులు పెట్టేసి జగన్‌ను వదిలేసి తనతో వచ్చేయమని పవన్ చెప్పగానే వచ్చేస్తారా?

First Published:  21 Jun 2023 6:16 AM GMT
Next Story