Telugu Global
Andhra Pradesh

ఇప్పుడు ఆ విషయం రాయగలవా రామోజీ..?

చంద్రబాబు కర్నూలు వెళ్లినప్పుడల్లా పేకాట మంత్రి అని, బెంజ్‌ కారు మంత్రి అంటూ గుమ్మనూరును విమర్శించేవాడని, అదే వ్యక్తికి బాబు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించాడని, పసుపు కండువా కప్పుకోగానే జయరాం ముత్యమైపోయాతాడా..?

ఇప్పుడు ఆ విషయం రాయగలవా రామోజీ..?
X

మంత్రి గుమ్మనూరు జయరాంను చంద్రబాబు నిన్నటివరకు బండబూతులు తిట్టాడు.. పేకాట మంత్రి పేరు రెడ్‌ బుక్‌లో రాసుకున్నానని లోకేష్‌ చెప్పాడు.. ఇక ‘ఈనాడు’లో రామోజీ అయితే.. గుమ్మనూరు అవినీతిపై ఓ స్పెష‌ల్ స్టోరీ రాశాడు.. ఇంతా చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఆయన్ని పసుపు కండువా కప్పి చేర్చేసుకున్నారు. మరి ఇప్పటివరకు వారు దొంగ అన్న జయరాం.. ఇప్పుడు మంచివాడయ్యాడా?.. ఇవీ అనంతపురం జిల్లా గుంతకల్లు వైసీపీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి గుమ్మనూరు జయరాంను టీడీపీ చేర్చుకున్న చంద్రబాబు ఇప్పుడేం చెబుతాడని నిలదీశారు.

చంద్రబాబు కర్నూలు వెళ్లినప్పుడల్లా పేకాట మంత్రి అని, బెంజ్‌ కారు మంత్రి అంటూ గుమ్మనూరును విమర్శించేవాడని, అదే వ్యక్తికి బాబు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించాడని, పసుపు కండువా కప్పుకోగానే జయరాం ముత్యమైపోయాతాడా..? అంటూ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి నిలదీశారు. అప్పుడాయన అవినీతి చేసి ఉంటే టీడీపీలోకి రాగానే ఆ పాపాలన్నీ ప్రక్షాళన అయినట్టుగా బాబు భావిస్తున్నారా..? అని నిలదీశారు.

లోకేష్‌ యువగళం పాదయాత్రలో ఆలూరు వెళ్లినప్పుడు ఇక్కడి పేకాట మంత్రి పేరు రెడ్‌బుక్‌లో రాసుకున్నా.. అని ప్రకటించాడని ఎమ్మెల్యే చెప్పారు. జయరాం ఇప్పుడు టీడీపీలోకి చేరినందున, ఆయన పేరు రెడ్‌ బుక్‌ నుంచి తిసేస్తారా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఇక గుమ్మనూరు జయరాం గురించి రామోజీ తన పత్రిక ‘ఈనాడు’లో కథనం రాశాడని, ఇప్పుడు బెంజ్‌ కారులో గుమ్మంలోకి అవినీతిని తెచ్చుకున్నామని రాయగలడా అంటూ ఆయన నిలదీశారు.

టీడీపీ శ్రేణుల నిరసన..

మరోపక్క గుమ్మనూరు జయరాంకు వ్యతిరేకంగా తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గుమ్మ‌నూరుకు గుంతకల్లులో సీటిస్తే ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. ఆలూరులో చెత్త ఇక్కడ బంగారం అవుతుందా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. స్థానిక టీడీపీ నేత జితేంద్ర గౌడ్‌ను కాదని గుమ్మ‌నూరుకు టిక్కెట్‌ ఇస్తే డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఒకపక్క గుమ్మనూరు జయరాం, మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా పరిణమించాయి.

First Published:  7 March 2024 5:12 AM GMT
Next Story