Telugu Global
Andhra Pradesh

పురందేశ్వరి.. నీ గతం గురించి నాకు తెలుసు - ఎంపీ విజయసాయిరెడ్డి

నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలతో సహా నిరూపించండి అని సవాల్‌ చేశారు.

పురందేశ్వరి.. నీ గతం గురించి నాకు తెలుసు  - ఎంపీ విజయసాయిరెడ్డి
X

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమె ఆ పార్టీ అజెండాను పక్కనపెట్టి తన సొంత అజెండాను అమలుచేస్తున్నారని మండిపడ్డారు. పురందేశ్వరికి తన కుటుంబం, తన సామాజికవర్గం గురించి తప్ప రాష్ట్రం గురించి గాని, రాష్ట్ర ప్రజల గురించి గాని అసలు తెలియదని చెప్పారు. శనివారం బాపట్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పురందేశ్వరి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం డిస్టిలరీలపై ఆమెకు ఏవైనా అనుమానాలు ఉంటే వెరిఫై చేసుకోవాలని చెప్పారు.

లిక్కర్‌ విషయంలో పురందేశ్వరి తనపై, లోక్‌సభ ఫ్లోర్‌ లీడర్‌ అయిన మిథున్‌రెడ్డిపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలతో సహా నిరూపించండి అని సవాల్‌ చేశారు. పురందేశ్వరి గతం గురించి తనకు తెలుసని, తాను బయటపడితే ఆమె ఏమవుతుందో తనకు తెలియదని ఆయన చెప్పారు. ఆమె మహిళ కాబట్టి తాను బయటపెట్టడం లేదని ఆయన తెలిపారు. ఆ విషయాల గురించి మాట్లాడకుండా తనను తాను కంట్రోల్‌ చేసుకుంటున్నానని చెప్పారు.

చంద్రబాబు చరిత్ర ముగిసింది...

రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేస్తుంటే.. టీడీపీ నేతలు స‌హించ‌లేక‌పోతున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. అలాగే పేదలకు పింఛన్ మొత్తం పెంచుతున్నా తట్టుకోలేకపోతున్నారని అన్నారు. జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్చుకోలేకపోతున్నారన్నారు. బాబు తన హయాంలో తన కుటుంబాన్ని మాత్రమే చూసుకున్నారని, రాష్ట్ర ప్రజలను పట్టించుకోలేదని చెప్పారు. ప్రజలను చంద్ర‌బాబు పట్టించుకోలేదు కాబట్టే.. నేడు ఆయన్ని ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు చరిత్ర ఇక ముగిసిందని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలుపొందడం ఖాయమని ఎంపీ స్పష్టం చేశారు.


First Published:  29 Oct 2023 8:01 AM GMT
Next Story