Telugu Global
Andhra Pradesh

సిగ్గులేకుండా మోదీతో కలిశారు

అసలు జనసేన పార్టీని పెట్టింది దేనికి అని ప్రశ్నించారు కొడాలి నాని. పక్కన పార్టీలను సీట్లు అడుక్కోవడానికా? అన్నారు.

సిగ్గులేకుండా మోదీతో కలిశారు
X

దేశాన్ని దోచుకున్న మోదీ అంటూ ప్రధాన మంత్రిని నానా బూతులు తిట్టిన చంద్రబాబుకి మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకోడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. పాచిపోయిన లడ్డూలిచ్చారన్న పవన్ ఏ మొహం పెట్టుకుని మోదీతో కలిశారన్నారు. తన తల్లిని దూషించారని, టీడీపీ అంతు చూస్తానని ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడెలా టీడీపీతో అంటకాగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్.. అందరూ కలసినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరని చెప్పారు నాని.

ఏపీలో కాంగ్రెస్ డిస్పోజబుల్ పార్టీ అని ఎద్దేవా చేశారు కొడాలి నాని. డిపాజిట్లు కూడా రానోళ్లు 5 వేల రూపాయలు నెల నెలా మహిళలకు ఇస్తారంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా అని అన్నారు. కాంగ్రెస్‌లో ఉండి బీజేపీ కూటమిలో ఉన్న చంద్రబాబును గెలిపించడానికి షర్మిల ప్రయత్నిస్తోందన్నారు నాని. మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్‌కు ఏం సంబంధం? అన్నారు. తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తురాలేదా?, పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనిల్ మణిపూర్ వెళ్లాడా? అని ప్రశ్నించారు.

ఎందుకీ కలయిక..?

రాష్ట్రంలో ఏం విధ్వంసం జరిగిందని వారంతా కలిశారని ప్రశ్నించారు కొడాలి నాని. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా.. అన్నారు. పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా.. అని అడిగారు. ఒకరినొకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారని విమర్శించారు. పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడని, అసలు జనసేన పార్టీని పెట్టింది దేనికి అని ప్రశ్నించారు. పక్కన పార్టీలను సీట్లు అడుక్కోవడానికా? అన్నారు. జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యే పరిస్థితి లేదని, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్ అని తేల్చి చెప్పారు నాని.

First Published:  12 March 2024 12:26 PM GMT
Next Story