Telugu Global
Andhra Pradesh

మోడీతో ఉంటే పవన్‌కు ఓటు వేయను.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్

పవన్ కళ్యాణ్ మోడీతో కొనసాగితే ఆయనకు ఓటు వేయను.. అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్నేహితురాలు గౌరీ లంకేష్‌ను హత్య చేయడంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

మోడీతో ఉంటే పవన్‌కు ఓటు వేయను.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ వెంట ఉంటే ఆయనకు ఓటు వేయను.. అంటూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కర్ణాటకలో కొన్నేళ్ల కిందట సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. గౌరీ లంకేష్ ప్రకాష్ రాజ్‌కు స్నేహితురాలు కావడంతో ఆమె హత్యపై ప్రకాష్ రాజ్ అప్పట్లో తీవ్రంగా స్పందించారు. గౌరీ లంకేష్ హత్య తర్వాత బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారని.. ఆమె హత్యలో ఆ పార్టీ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు.

ఈ విషయం గురించి మౌనం వహించారంటూ ప్రధానమంత్రి మోడీపై పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత కర్ణాటకలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఓటమి చెందారు.

కాగా, తాజాగా ఓ మీడియా సంస్థతో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పవన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో తాను కూడా నటిస్తున్నానని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఓటు శాతం ఎంత ఉంది? మోడీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నావని ప‌వ‌న్‌ను ప్రశ్నించినట్లు చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని పవన్ తెలియజేశారన్నారు. మీలాంటి వాళ్లు ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా ఉండాలని తనకు పవన్ సూచించినట్లు తెలిపారు.

కాగా, పవన్ కళ్యాణ్ మోడీతో కొనసాగితే ఆయనకు ఓటు వేయను.. అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్నేహితురాలు గౌరీ లంకేష్‌ను హత్య చేయడంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. పవన్‌కు ఓటు వేయను.. అంటూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైర‌ల్‌గా మారాయి.

First Published:  14 Nov 2023 3:25 AM GMT
Next Story