Telugu Global
Andhra Pradesh

కర్నూలు జిల్లాలో రైతుకు దొరికిన రూ. 2 కోట్ల వజ్రం

. రైతు వజ్రాన్ని చూసిన వ్యాపారాలు చాలా విలువైనది తేల్చారు. కొందరు వ్యాపారులు పోటీపడి వేలం నిర్వహించారు. లక్షల్లో మొదలైన వేలం ఏకంగా రెండు కోట్ల వద్ద ఆగింది.

కర్నూలు జిల్లాలో రైతుకు దొరికిన రూ. 2 కోట్ల వజ్రం
X

కర్నూలు జిల్లాలో రైతుకు దొరికిన రూ. 2 కోట్ల వజ్రం

రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షం వస్తే వజ్రాల పంట పడుతుంది. అనంతపురం జిల్లా వజ్రకరూర్‌, కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని పలు మండలాల్లో తొలకరి వర్షాలకు వజ్రాలు బయటపడుతుంటాయి. ఈ వజ్రాలతో అనేక మంది తలరాతలు మారిపోయాయి. తాజాగా అత్యంత విలువైన వజ్రం బయటపడింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం బసినేపల్లిలో ఈ వజ్రం దొరికింది.

గత కొద్దిరోజులుగా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. దాంతో చాలా ప్రాంతంలో వజ్రాల వేట మొదలైంది. రాత్రి వర్షం కురవడంతో ఉదయం బసినేపల్లికి చెందిన రైతు ఒకరు తన పొలానికి వెళ్లారు. అక్కడ సూర్యకాంతికి ఒక రాయి మెరుస్తూ కనిపించింది. అప్పటికే ఆ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని తెలిసిన రైతు ఆ రాయిని తీసుకెళ్లి స్థానిక వ్యాపారులకు చూపించారు. తొలకరి వర్షాల సమయంలో వందల మంది వజ్రాలను వెతుకుతుంటారు. దాంతో వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు అక్కడే తిష్ట వేస్తుంటారు. రైతు వజ్రాన్ని చూసిన వ్యాపారాలు చాలా విలువైనది తేల్చారు. కొందరు వ్యాపారులు పోటీపడి వేలం నిర్వహించారు. లక్షల్లో మొదలైన వేలం ఏకంగా రెండు కోట్ల వద్ద ఆగింది. ఆ మేరకు సొమ్మును కూడా ఒక వ్యాపారి చెల్లించి రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఆ వజ్రం విలువ 10 కోట్లకు పైగానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో ఇంతటి విలువైన వజ్రం దొరకడం ఇదే తొలిసారని చెబుతున్నారు. కాకపోతే ఏటా చిన్నచిన్న వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి. వేల ఎకరాల్లో విస్తరించిన చేలల్లో వందల మంది వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఇక్కడ విలువైన వజ్రాలు దొరుతాయని తెలిసినా, వ్యాపారులు వాటిని కొంటుంటారని తెలిసినా అధికారులు ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు, నిఘా ఉంచేందుకు అనుకూలతలు లేవు. అనేక మంది పేద రైతులను, కూలీలను ఈ వజ్రాలు ధనికులుగా మారుస్తుండటంతో అధికారులు కూడా చూసిచూడనట్టు వదిలేస్తున్నారు.

First Published:  6 Jun 2023 10:41 AM GMT
Next Story