Telugu Global
Andhra Pradesh

చేసింది చెప్పుకోడానికి చంద్రబాబు వద్ద ఏముంది..?

గతంలో చంద్రబాబు చేసిన అప్పులకంటే తాను తక్కువే చేస్తున్నానని, అయినా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పారు జగన్.

చేసింది చెప్పుకోడానికి చంద్రబాబు వద్ద ఏముంది..?
X

"గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా చూడండి, మంచి జరిగిందని భావిస్తేనే నన్ను ఆశీర్వదించండి, ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టే మీ ముందుకు వచ్చి అడుగుతున్నాను." అంటూ భోగాపురం సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు సీఎం జగన్. గతంలో చంద్రబాబు చేసిన అప్పులకంటే తాను తక్కువే చేస్తున్నానని, అయినా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పారు.

తాను ఏం చేశానో చెప్పి ప్రజల ముందుకొస్తున్నానని, కోటీ 50 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని నాయకులు వివరించారని చెప్పారు సీఎం జగన్. చంద్రబాబుకి అలా అడిగే దమ్ముందా? అని ప్రశ్నించారు. చేసింది చెప్పడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ముఠా దోచుకో, పంచుకో, దాచుకో అనే రీతిలో రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు.


చంద్రబాబుకి తోడు ఈనాడు, ఏబీఎన్ కూడా ప్రజలను దారుణంగా మోసం చేశాయన్నారు జగన్. ప్రజలకు ఎలాంటి మంచి చేయని చంద్రబాబుకు దత్త పుత్రుడు ఎందుకు సహకరిస్తున్నాడో అర్థం కావడంలేదన్నారు.


కాపురం వచ్చేస్తున్నా..

ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్ధికి మారుపేరులా నిలుస్తుందని చెప్పారు జగన్. ఉద్ధానం కిడ్నీ సమస్యతోపాటు, ఇతర అనేక సమస్యలకు తమ హయాంలోనే పరిష్కారం లభించిందని అన్నారు. ఇకపై ఉత్తరాంధ్రనుంచి ఎవరూ వలస వెళ్లక్కర్లేదని ఇక్కడికే అందరూ ఉద్యోగాలకోసం వచ్చే విధంగా తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు.

మీ బిడ్డ ఈ సెప్టెంబర్ నుంచి ఇక్కడే కాపురం ఉంటాడు అని భరోసా ఇచ్చారు. రాజధాని తరలింపుతో ఉత్తరాంధ్ర మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు జగన్. భోగాపురంలో ఎయిర్ పోర్ట్ కి శంకుస్థాపన చేశామని 2026లో మళ్లీ మీ బిడ్డే వచ్చి ఈ ఎయిర్ పోర్ట్ ని ప్రారంభిస్తాడు చూడండి అని హామీ ఇచ్చారు జగన్.

First Published:  3 May 2023 8:56 AM GMT
Next Story