Telugu Global
Andhra Pradesh

ల్యాండ్‌ మాఫియాతో లింక్స్‌... అయినా అత‌నికే టీడీపీ టికెట్‌

ప్రభుత్వ, దళిత భూముల ఆక్రమించుకుని వేల కోట్ల ఆస్తులను కాజేయడానికి శివానందరెడ్డి కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు జరిపి, దర్యాప్తు ప్రారంభించారు.

ల్యాండ్‌ మాఫియాతో లింక్స్‌... అయినా అత‌నికే టీడీపీ టికెట్‌
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుది ద్వంద్వ ప్రవృత్తి. చెప్పేదొకటి, చేసేది మ‌రొక‌టి. శివానందరెడ్డికి నంద్యాల లోక్‌సభ సీటును కేటాయించడానికి సిద్ధపడడాన్ని బట్టి ఆయన‌ ద్వంద్వ ప్రవృత్తి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మాజీ పోలీస్ ఆఫీసర్‌ ఎం. శివానందరెడ్డి భూదందాలతో, అక్రమ సంపాదనతో నెలకొల్పిన వెస్సాల గ్రూప్‌ కంపెనీలకు ల్యాండ్‌ మాఫియాతో సంబంధాలున్నాయని హైదరాబాద్‌ నగర పోలీసులు దాఖలు చేసిన కేసును బట్టి స్పష్టమవుతోంది. శివానందరెడ్డి ధనబలాన్ని గుర్తించిన చంద్రబాబు నంద్యాల లోక్‌సభ సీటును ఆయనకు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. శివానందరెడ్డి 2019లో టీడీపీ టికెట్‌పై నంద్యాల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా కూడా చంద్రబాబు మళ్లీ ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు.

ప్రభుత్వ, దళిత భూముల ఆక్రమించుకుని వేల కోట్ల ఆస్తులను కాజేయడానికి శివానందరెడ్డి కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు జరిపి, దర్యాప్తు ప్రారంభించారు. శివానందరెడ్డికి చెందిన వెస్సాల గ్రూప్‌ కంపెనీలకు ల్యాండ్‌ మాఫియాతో సంబంధాలున్నాయని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని మంచిరేవులలో ఉన్న దాదాపు 10 వేల కోట్ల రూపాయల విలువ చేసే 300 ఎకరాల భూమి తమదేనంటూ 45 మంది ప్రైవేట్‌ వ్యక్తులు, జీపీఏ హోల్డర్లు కోర్టు తలుపు తట్టారు. 2006లో ప్రభుత్వం ఆ భూమిని గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. దాంతోనే వారు తమకు ఆ భూమి వారసత్వంగా సంక్రమించిందని కోర్టుకు ఎక్కారు. అయితే, సింగిల్‌ జడ్జి బెంచ్‌ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజన్‌ బెంచ్‌ వారికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ భూకబ్జాదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును సమర్థించింది. దాంతో ఆగకుండా వారు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై కూడా సుప్రీంకోర్టు అదే తీర్పును ఇచ్చింది.

ఆ భూఆక్రమణకు పాల్పడినవారిలో వెస్సాల గ్రూప్‌నకు చెందిన మాజీ పోలీస్ ఆఫీసరు శివానందరెడ్డి బంధువు ఉన్నాడని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా చెప్పింది. ఇంత జరిగినా కూడా చంద్రబాబు మళ్లీ శివానందరెడ్డి వైపే మొగ్గు చూపడం వెనక ఆంతర్యం స్పష్టంగానే అర్థమవుతోంది. అక్రమార్జన కోట్లు సంపాదించినవారి కొమ్ము కాయడంలో చంద్రబాబు ముందుంటారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

First Published:  4 Feb 2024 5:00 AM GMT
Next Story