Telugu Global
Andhra Pradesh

వాలంటీర్లు రాజీనామా చేసినా ఏడుపేనా..?

ఎన్నికల సమయంలో మళ్లీ వారిపై విషం చిమ్ముతున్నారు. వాలంటీర్లు రాజీనామా చేసినా వారిని వదలడంలేదు.

వాలంటీర్లు రాజీనామా చేసినా ఏడుపేనా..?
X

వాలంటీర్లపై విషం చిమ్మడాన్ని ఎల్లో మీడియా ఇంకా ఆపలేదు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం జరపాలని ప్రయత్నించి సక్సెస్ అయింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంటే సరిపోదు, రాజకీయ కార్యక్రమాల్లో కూడా కనపడకూడదు అన్నారు, అలాగే వారు దూరం జరిగారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు వాలంటీర్ పోస్ట్ లకు రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. అయినా కూడా వారిపై ఎల్లోమీడియాకు కక్ష చల్లారలేదు. వాలంటీర్లు రాజీనామా చేసి, వైసీపీ నాయకుల వెంట వెళ్తున్నారంటూ గగ్గోలు పెడుతోంది.

వాలంటీర్లను రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు చెబుతున్నారని, తిరిగి అధికారంలోకి వచ్చాక వారికి ఉద్యోగం, నగదు ఇచ్చేలా హామీలిస్తున్నారని.. అందుకేవారు రాజీనామాలు చేస్తున్నారని ఎల్లో మీడియా కథనాలిస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏడుగురు వాలంటీర్లు రాజీనామా చేయడాన్ని ఇలానే హైలైట్ చేశారు. వాలంటీర్లు రాజీనామా చేస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటి..? విధుల్లో లేనివారు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఎల్లో మీడియాకు ఏం నొప్పి..? ఇంత చిన్న లాజిక్ మరచిపోయి రాద్ధాంతం మొదలు పెట్టారు.

మొదట్లో వాలంటీర్లపై ఏకపక్షంగా ఆరోపణలు గుప్పించారు టీడీపీ-జనసేన అధినేతలు. వాలంటీర్లను విలన్లుగా, అమ్మాయిలను ట్రాప్ చేసేవారిగా చిత్రీకరించాలనుకున్నారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో చివరకు లెంపలేసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినా వాలంటీర్లకు వచ్చిన నష్టమేమీ లేదని సన్నాయి నొక్కులు నొక్కారు. తీరా ఎన్నికల సమయంలో మళ్లీ వారిపై విషం చిమ్ముతున్నారు. వాలంటీర్లు రాజీనామా చేసినా వారిని వదలడంలేదు. ఓటమి భయంతోనే టీడీపీ, ఎల్లో మీడియా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయనే విమర్శలు వినపడుతున్నాయి.

First Published:  24 March 2024 3:44 AM GMT
Next Story