Telugu Global
Andhra Pradesh

తెగేదాకా లాగుతున్న జగన్.. ఏపీ ఉద్యోగుల్లో గందరగోళం

డీఏ అరియర్స్, సరెండర్ లీవ్‌ లకు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదంటున్నారు. వీటన్నిటికీ క్లారిటీ కావాలంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.

తెగేదాకా లాగుతున్న జగన్.. ఏపీ ఉద్యోగుల్లో గందరగోళం
X

ఏపీలో ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయా లేవా..?

ఉంటే వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందా..? లేదా..?

ఒకవేళ పరిష్కరిస్తే ఎప్పటిలోగా..?

ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పడంలేదు, తెలివిగా దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది. తాజాగా ఉద్యోగ సంఘాలతో చర్చలన్నారు. కానీ అక్కడ ప్రయారిటీ వైసీపీ అనుకూల సంఘానికే దక్కింది. చర్చల తర్వాత మాట్లాడింది కూడా వారే. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందని చేసిన ప్రకటన కూడా వారిదే. కానీ తర్వాతే అసలు నాయకులు రియాక్ట్ అయ్యారు. అసలా చర్చలు అధికారికం కావని తేల్చేశారు. ఆ మాటలన్నది ప్రభుత్వమేనంటూ మరో బాంబు పేల్చారు. అసలు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు అనధికారికంగా చర్చలు జరపడమేంటి..? ఆ చర్చల గురించి గొప్పగా మీడియాకు చెప్పుకోవడమేంటి..?

సీపీఎస్ రద్దు, పీఆర్సీ పెంపు, ఇతర బకాయిల విషయంలో ఏపీ ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నమాట వాస్తవం. కానీ ప్రభుత్వం మాత్రం ఓ వర్గాన్ని చేరదీసి ఉద్యోగుల్లో అసలు అసంతృప్తే లేదని చెప్పుకుంటోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి ఉందనడానికి సంబంధం లేదంటోంది.

ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని చెబుతూ.. వచ్చే నెలనుంచి వారికి అనుకూలమైన జీవోలు వరుసగా విడుదలవుతాయని చెప్పారు. కానీ ఏపీజేఏసీ అమరావతి నేతలు మాత్రం తమ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామంటున్నారు. ఇతర సంఘాలు కూడా వారికే మద్దతు తెలుపుతున్నాయి.

క్లారిటీ కావాల్సిందే..

ఉద్యోగ సంఘాల నేతలు క్లారిటీ కావాలంటున్నారు. డీఏలు సెటిల్ చేయలేదని, పీఆర్సీ సమస్యలు అలాగే ఉన్నాయని, 50 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ అరియర్స్, సరెండర్ లీవ్‌ లకు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదంటున్నారు. వీటన్నిటికీ క్లారిటీ కావాలంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.

First Published:  29 April 2023 4:33 AM GMT
Next Story