Telugu Global
Andhra Pradesh

లోకేష్ కి నిద్రపట్టని రోజు ఇది..

ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడిన టైమ్ లో అందరికంటే ఎక్కువ సంతోషపడిన వ్యక్తి నారా లోకేష్. అయితే ఆ సంతోషం ఇంత తొందరగా ఆవిరై పోతుందని ఊహించి ఉండరు.

లోకేష్ కి నిద్రపట్టని రోజు ఇది..
X

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. సీఎం జగన్ ని కలసిన ఆయన తిరిగి పార్టీలో చేరినట్టు ప్రకటించారు. మంగళగిరిలో మూడోసారి వైసీపీని గెలిపించేందుకే తాను పార్టీలో చేరినట్టు చెప్పారు. ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా పూర్తి మద్దతిస్తానన్నారు. వైసీపీకి మంగళగిరిలో హ్యాట్రిక్ ఖాయమని స్పష్టం చేశారు. జగన్ ని ఆలింగనం చేసుకున్న ఫొటోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ అన్నదమ్ముల కలయిక అనే కామెంట్ జతచేశారు ఆళ్ల.


లోకేష్ ఏడుపు..

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన పార్టీ మారిన టైమ్ లో అందరికంటే ఎక్కువ సంతోషపడిన వ్యక్తి నారా లోకేష్. అయితే ఆ సంతోషం ఇంత తొందరగా ఆవిరై పోతుందని ఊహించి ఉండరు. ఆళ్ల వైసీపీని వీడిన సమయంలో తన గెలుపు ఖాయమని లెక్కలేసుకున్నారు లోకేష్. కానీ ఇప్పుడు ఆళ్ల తిరిగి వైసీపీలో చేరడంతో లోకేష్ కి ఇక నిద్రపట్టదని తేలిపోయింది.

వరుసగా రెండుసార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. గత ఎన్నికల్లో మంత్రి హోదాలో ఉండి పోటీ చేసిన లోకేష్ ని మట్టికరిపించారు ఆళ్ల. మూడోసారి కూడా మంగళగిరి సీటు ఆశించారు. కానీ అనూహ్యంగా అక్కడ బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని తెరపైకి తెచ్చారు సీఎం జగన్. ఆయన్ను నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ గా ప్రకటించారు. దీంతో ఆళ్ల పార్టీ మారారు. కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకుని వైసీపీలోకి వచ్చారు. దీంతో అక్కడ గంజి చిరంజీవి విజయం ఖాయమని తేలిపోయింది. చేనేత సామాజిక వర్గానికి చెందిన బీసీ ఓట్లు చిరంజీవికి వన్ సైడ్ గా పడే అవకాశాలున్నాయి. ఆళ్ల వర్గం కూడా వైసీపీవైపే ఉంటుంది. దీంతో లోకేష్ కి షాక్ తగిలినట్టయింది.

First Published:  20 Feb 2024 1:49 PM GMT
Next Story