Telugu Global
NEWS

విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చాం.. చదువుల విషయంలో తగ్గేది లేదు: సీఎం జగన్

ఏపీలోని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని, పిల్లల చదువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కు తగ్గదని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఏపీలో పాఠశాలలు ఈరోజు (జూలై 5) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆదోనిలో ప్రారంభించారు. వరుసగా మూడో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్‌లో ఒకటి […]

విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చాం.. చదువుల విషయంలో తగ్గేది లేదు: సీఎం జగన్
X

ఏపీలోని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని, పిల్లల చదువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కు తగ్గదని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఏపీలో పాఠశాలలు ఈరోజు (జూలై 5) నుంచి ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఆయన జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆదోనిలో ప్రారంభించారు. వరుసగా మూడో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్‌లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది 47,40,421 మందికి కిట్ల పంపిణీ కోసం రూ. 931.02 కోట్లను ఖర్చు చేస్తోంది.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదరికాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గం. ప్రతీ ఒక్కరికి మంచి చదువును అందించాలి. నాణ్యమైన విద్యతోనే పేదరికాన్ని రూపుమాపగలము. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనేదే నా ఆశయం. అందుకే పిల్లల చదువులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తల్లులకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నాము. గోరుముద్ద పథకంతో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని అన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగు పరచడానికి నాడు-నేడు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

ప్రస్తుతం మారిన పరిస్థితులను బట్టి విద్యార్థులకు డిజిటల్ విద్యను కూడా అందించాలని నిర్ణయించాము. అందుకే బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. విద్యార్థుల కోసం బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు ఇవ్వడం ద్వారా కొత్త విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంతో ఇబ్బందులు పడకుండా చూస్తున్నామన్నారు. దీంతో పాటు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని కూడా అందిస్తున్నామని.. కొత్త పదాల అర్థాలను విద్యార్థులే నేర్చుకోవడానికి వీలుంటుందన్నారు. 8వ తరగతిలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు రూ. 12వేల విలువైన ట్యాబ్స్ అందించనున్నట్లు జగన్ చెప్పారు.

విద్యా కానుక కిట్లతో పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్స్, బెల్ట్, స్కూల్ బ్యాగ్, డిక్షనరీ ఉంటుందని చెప్పారు. బడి మానేసే పిల్లలు తగ్గాలని, సామాజిక ఆర్థిక అంతరాలు తగ్గాలని, పిల్లలకు చదువు అందించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కానుక ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. తొలి ఏడాది ఈ పథకం కోసం రూ. 648 కోట్లు, గత ఏడాది రూ. 789 కోట్లు ఖర్చు చేయగా.. ఈ సారి రూ. 931 కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

విద్యపై పెట్టే వ్యయం విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి అని జగన్ చెప్పారు. విద్యార్థుల చదువుల కోసం అవసరమైన వనరులను ప్రభుత్వం అందిస్తోంది, విద్యా రంగం కోసం బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని జగన్ గుర్తు చేశారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా.. ఈ నెల ఆఖరు వరకు కిట్లు పంపిణీ చేస్తామని చెప్పారు.

ఇక ఆదోని నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. ఆటో నగర్‌తో సహా జగనన్న కాలనీలకు బీటీ రోడ్లు, విస్తరణ కోసం రూ. 50 కోట్లు మంజూరు చేశారు. ఆదోనికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేశారు. త్వరలోనే గ్రామాల్లో తాగు నీటి సమస్య తీర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం 2022-23కు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు.

First Published:  5 July 2022 4:00 AM GMT
Next Story