Telugu Global
NEWS

మెట్రో స్టేషన్లలో ఆఫీసులు పెట్టుకోవచ్చు.. అద్దెకివ్వడానికి ఎల్ అండ్ టీ రెడీ!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రైలు ఏర్పాటుకు పనులు మొదలు పెట్టింది. కాస్త ఆలస్యంగా అయినా తెలంగాణ ఏర్పడిన తర్వాత మెట్రో సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. సరసమైన చార్జీలు, త్వరగా గమ్యస్థానం చేర్చుతుండటంతో అనతి కాలంలోనే మెట్రోకు ఆదరణ పెరిగింది. అయితే కోవిడ్ కారణంగా కొన్ని వారాల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడం.. వర్క్ ఫ్రం హోమ్ కారణంగా ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడం మానేయడంతో మెట్రోలో ప్రయాణించే […]

మెట్రో స్టేషన్లలో ఆఫీసులు పెట్టుకోవచ్చు.. అద్దెకివ్వడానికి ఎల్ అండ్ టీ రెడీ!
X

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రైలు ఏర్పాటుకు పనులు మొదలు పెట్టింది. కాస్త ఆలస్యంగా అయినా తెలంగాణ ఏర్పడిన తర్వాత మెట్రో సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి.

సరసమైన చార్జీలు, త్వరగా గమ్యస్థానం చేర్చుతుండటంతో అనతి కాలంలోనే మెట్రోకు ఆదరణ పెరిగింది. అయితే కోవిడ్ కారణంగా కొన్ని వారాల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడం.. వర్క్ ఫ్రం హోమ్ కారణంగా ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడం మానేయడంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిపోయింది.

దీంతో మెట్రో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు నష్టాలు తప్పలేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయం కోసం వ్యూహాలు రచించింది.

ఇప్పటికే పలుచోట్ల మెట్రోకు ఇచ్చిన స్థలాల్లో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్‌లు కట్టింది. తాజాగా మెట్రో స్టేషన్లలో ఉండే ఖాళీ స్థలాలను ఆఫీసుల కోసం అద్దెకు ఇవ్వడానికి నిర్ణయించింది. 57 మెట్రో స్టేషన్లలో ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నది.

వీటిలో 49 మెట్రో స్టేషన్లలో 1750 చదరపు అడుగుల మేర రెండు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలం ఉన్నది. అలాగే మిగిలిన 8 స్టేషన్లలో 5 వేల నుంచి 30వేల చదరపు అడుగుల స్థలం లీజుకు లభిస్తున్నది. త్వరలోనే వీటిని అద్దెకు ఇవ్వనున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఆఫీస్ స్పేస్‌ను లీజ్ తీసుకునేవారి సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఆ నగరాల్లో 1.28 కోట్ల చదరపు అడుగులకు చేరుకున్నది. ఈ ఏడాది హైదరాబాద్‌లో 35 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారు.

గతేడాదితో పోల్చుకుంటే 24 లక్షల చదరపు అడుగుల స్థలం పెరిగింది. పెరుగుతున్న డిమాండ్ మేరకు కొత్త నిర్మాణాలు కూడా ఊపందుకుంటున్నాయి. కోవిడ్ భయం కూడా తగ్గడంతో కార్యాలయాలు కళకళ లాడుతున్నాయి. ఈ క్రమంలోనే మెట్రో స్టేషన్లలో కార్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

First Published:  30 Jun 2022 10:56 PM GMT
Next Story