Telugu Global
National

దేశవ్యాప్త నిరసనల్లో హింస… పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి!

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖలకు నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా జ‌రిగిన నిరసన ప్రదర్శనలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. జార్ఖండ్‌లోని రాంచీలో పోలీసు కాల్పుల్లో ఇద్దరు మరణించారు. రాంచీలో, రాళ్లు రువ్విన ఒక గుంపును చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు, రాంచీ SSP సురేంద్ర ఝా, మరో అధికారి, ఒక పోలీసు గాయపడ్డారు. ఝా ధరించిన హెల్మెట్‌కు రాయి తగలడంతో కుప్పకూలిపోయాడు. జిల్లా యంత్రాంగం మెయిన్ రోడ్ ప్రాంతంలో నిషేధాజ్ఞలను విధించింది రాంచీ రూరల్ […]

police firing
X

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖలకు నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా జ‌రిగిన నిరసన ప్రదర్శనలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. జార్ఖండ్‌లోని రాంచీలో పోలీసు కాల్పుల్లో ఇద్దరు మరణించారు.

రాంచీలో, రాళ్లు రువ్విన ఒక గుంపును చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు, రాంచీ SSP సురేంద్ర ఝా, మరో అధికారి, ఒక పోలీసు గాయపడ్డారు. ఝా ధరించిన హెల్మెట్‌కు రాయి తగలడంతో కుప్పకూలిపోయాడు. జిల్లా యంత్రాంగం మెయిన్ రోడ్ ప్రాంతంలో నిషేధాజ్ఞలను విధించింది రాంచీ రూరల్ SP నౌషాద్ ఆలం మాట్లాడుతూ … “ఆందోళనకారులలో ఒకరు బుల్లెట్ గాయంతో మరణించారు. రాళ్ళు రువ్వడం వల్ల గాయాలైన మరో పన్నెండు మంది రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.” అన్నారు.

ఆందోళనకారుల గుంపుపైకి వాహనం దూసుకెళ్లడంతో పరిస్థితి విషమించిందని పోలీసు వర్గాలు తెలిపాయి. బుల్లెట్ గాయం ఎలా జరిగిందనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

యుపిలోని ప్రయాగ్‌రాజ్,పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో కూడా నిరసనలు హింసాత్మకంగా మారాయి. శ్రీనగర్‌లో బంద్ పాటించినప్పటికీ ఢిల్లీతో పాటు మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బీహార్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు శాంతియుతంగా జరిగాయి.

రాంచీలో శనివారం ఉదయం 6 గంటల వరకు,హౌరాలో సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి.

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కూడా నిరసనలు అదుపు తప్పాయి, అక్కడ భారీ రాళ్ల దాడిలో పలువురు పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. సాయంత్రం ఆలస్యంగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. “రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డ వారిపై, చట్టవిరుద్ధమైన నిరసనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని” ఆదేశించారు.

“ప్రజా ఆస్తులకు నష్టం జరిగిన చోట రికవరీ చర్యలను ప్రారంభించాలని ఆయన అధికారులను కోరారు” అని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. .

సహారాన్‌పూర్‌లో 45 మందిని, ప్రయాగ్‌రాజ్‌లో 37 మందిని, అంబేద్కర్‌నగర్‌లో 23, హత్రాస్‌లో 20, మొరాదాబాద్‌లో ఏడుగురు, ఫిరోజాబాద్‌లో నలుగురితో సహా మొత్తం 136 మందిని అరెస్టు చేసినట్లు యుపి పోలీసులు తెలిపారు.

ప్రయాగ్‌రాజ్ ఎస్‌ఎస్పీ అజయ్ కుమార్ మాట్లాడుతూ… ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత యువత వీధుల్లోకి రావడంతో హింస చెలరేగింది. “వారిలో చాలా మంది మైనర్లు ఉన్నారు. మేము వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించాము. అయినా ప్రజలు రోడ్ల మీదికి వచ్చి నినాదాలు చేస్తూనే ఉన్నారు. పోలీసు బలగాల కాల్పుల్లో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి అదుపులో ఉంది” అని కుమార్ తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో, నిరసనకారులు పోలీసు స్టేషన్‌పై దాడి చేయడంతో పాటు అనేక‌ వాహనాలకు నిప్పుపెట్టారు. ఆ తర్వాత‌ అనేక ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించబడ్డాయి. దాదాపు 12 మంది పోలీసులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కొన్ని బీజేపీ కార్యాలయాలపై దాడులు జరిగినట్టు ఆ పార్టీ ఆరోపించింది.

అదే రాష్ట్రంలోని ధులాగఢ్‌లో, జాతీయ రహదారిని దిగ్బంధించిన గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దొమ్‌జూర్‌లోని పోలీసు స్టేషన్‌పై ఆందోళనకారులు దాడి చేసి ధ్వంసం చేశారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలో, నిరసనకారులు నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కార్యాలయానికి చేరుకుని మెమోరాండం అందజేశారు.

గుజరాత్‌లో, వడోదర, అహ్మదాబాద్‌లలో నిరసనలు జరిగాయి. అక్కడ అనేక ప్రాంతాల్లో దుకాణాలు మూసివేయబడ్డాయి. బీహార్‌లోని భోజ్‌పూర్, ముజఫర్‌పూర్, నవాడా జిల్లాల్లో కూడా నిరసనలు జరిగాయి.

హైదరాబాద్‌లో, మక్కా మసీదు వెలుపల బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి పలువురు నిరసనకారులు గుమిగూడడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

First Published:  11 Jun 2022 1:49 AM GMT
Next Story