Telugu Global
National

ఐఏఎస్‌ దంపతుల అహంకారం, లద్దాఖ్‌కు బదిలీ

తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం క్రీడాకారులను ఇబ్బంది పెట్టిన ఐఏఎస్‌ దంపతులపై వేటు పడింది. ఒకరు లద్దాఖ్‌కు, మరొకరు అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. ఢిల్లీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్‌ ఖిర్వార్‌ను ఢిల్లీ నుంచి లద్దాఖ్‌కు బదిలీ చేశారు. ఆయన భార్య, ఢిల్లీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ శాఖ సెక్రటరీ రింకు దుగ్గను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేసింది ప్రభుత్వం. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదిక మేరకు ఈ చర్యలు తీసుకుంది కేంద్ర […]

ఐఏఎస్‌ దంపతుల అహంకారం, లద్దాఖ్‌కు బదిలీ
X

తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం క్రీడాకారులను ఇబ్బంది పెట్టిన ఐఏఎస్‌ దంపతులపై వేటు పడింది. ఒకరు లద్దాఖ్‌కు, మరొకరు అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. ఢిల్లీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్‌ ఖిర్వార్‌ను ఢిల్లీ నుంచి లద్దాఖ్‌కు బదిలీ చేశారు. ఆయన భార్య, ఢిల్లీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ శాఖ సెక్రటరీ రింకు దుగ్గను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేసింది ప్రభుత్వం. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదిక మేరకు ఈ చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

వీఐపీ కల్చర్‌కు అలవాటు పడ్డ సంజీవ్‌ ఖిర్వార్‌ దంపతులు.. ఢిల్లీలోని త్యాగరాజ్‌ స్టేడియంలో రోజూ సాయంత్రం వాకింగ్‌కు వస్తున్నారు. ఇదివరకు రాత్రి ఏడు గంటల వరకు స్టేడియంను క్రీడాకారుల కోసం అందుబాటులో ఉంచేవారు. కొన్ని నెలలుగా ఈ స్టేడియంలోకి సంజీవ్, అతడి భార్య, అతడి కుక్క వాకింగ్‌ రావడం మొదలైంది. క్రీడాకారులుంటే తమకు, తమ కుక్కకు ఇబ్బంది అని భావించిన ఐఏఎస్‌ దంపతులు.. రాత్రి ఆరు గంటలకే క్రీడాకారులు పంపించివేయాల్సిందిగా స్టేడియం నిర్వాహకులకు ఆదేశించారు. వారు అలాగే చేశారు. ఆరు గంటలకు క్రీడాకారులు వెళ్లిపోగానే.. ఐఏఎస్ దంపతులు తాపీగా తమ కుక్కతో వచ్చి స్టేడియంలో వాకింగ్ చేసేవారు. మైదానంలో కుక్కను స్వేచ్ఛ‌గా వదిలేసేవారు.

ఈ విషయం మీడియాకు తెలియడంతో పెద్దెత్తన కథనాలు ప్రసారం అయ్యాయి. క్రీడాకారులను పంపించి ఐఏఎస్ దంపతులు తమ కుక్కతో దర్జాగా వాకింగ్ చేస్తున్న దృశ్యాలను ప్రసారం చేశాయి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. రాత్రి పది గంటల వరకు ఢిల్లీలోకి మైదానాలు క్రీడాకారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. క్రీడా మైదానాలను త్వరగా మూసివేయడం వల్ల అధిక వేడి వాతావరణం వల్ల క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని అందుకే రాత్రి 10 వరకు స్టేడియంలను తెరిచి ఉంచేలా ఆదేశించామని సీఎం తెలిపారు. మీడియాలో కథనాలు , ఢిల్లీ సీఎస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్ దంపతులను కేంద్రం బదిలీ చేసింది.

First Published:  26 May 2022 9:27 PM GMT
Next Story