Telugu Global
NEWS

సీఎం పదవి కోసం బ్రోకర్‌కు కన్నా 20 కోట్లు లంచం ఇచ్చారు " అంబటి

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడుపోయి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు ఏం మాట్లాడితే కన్నా లక్ష్మీనారాయణ అచ్చం అలాగే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరోనా కిట్లలోనూ కమిషన్‌ కొడుతారా… అంటూ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి గాలి ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన విజయసాయిరెడ్డి… 20 కోట్లకు చంద్రబాబుకు అమ్ముడుపోయారు అనగానే కన్నా లక్ష్మీనారాయణ ఊగిపోతున్నారని విమర్శించారు. బీజేపీతో […]

సీఎం పదవి కోసం బ్రోకర్‌కు కన్నా 20 కోట్లు లంచం ఇచ్చారు  అంబటి
X

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడుపోయి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు ఏం మాట్లాడితే కన్నా లక్ష్మీనారాయణ అచ్చం అలాగే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కరోనా కిట్లలోనూ కమిషన్‌ కొడుతారా… అంటూ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి గాలి ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన విజయసాయిరెడ్డి… 20 కోట్లకు చంద్రబాబుకు అమ్ముడుపోయారు అనగానే కన్నా లక్ష్మీనారాయణ ఊగిపోతున్నారని విమర్శించారు.

బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేని, ఎలాంటి సిద్ధాంతాలపరమైన పరిచయం లేని వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ అని అంబటి విమర్శించారు. ప్రాంతీయ పార్టీల గురించి విమర్శలు చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ… వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. వైసీపీలో చేరేందుకు 2018 ఏప్రిల్ 25న ముహూర్తంగా పెట్టుకున్నది నిజం కాదా అని నిలదీశారు.

తిరిగి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తామనగానే వైసీపీలో చేరకుండా ఉండేందుకు 2018 ఏప్రిల్ 24 వతేది అర్థరాత్రి గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో చేరింది నిజం కాదా అని నిలదీశారు.

ఇలాంటి కన్నా లక్ష్మీనారాయణకు వైసీపీని విమర్శించే హక్కు, స్థాయి ఎక్కడుందని ప్రశ్నించారు. ఇదే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా బేరసారాలు జరిపింది నిజం కాదా అని అంబటి నిలదీశారు.

కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడుపోయారు అన్న విషయంలో కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు విజయసాయిరెడ్డి సిద్ధంగా ఉన్నారని… అదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కూడా వచ్చి 2018 ఏప్రిల్‌ 24న నిజంగానే గుండెపోటు వచ్చిందని ప్రమాణం చేయాలని సవాల్ చేశారు.

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన వెంటనే రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారని… రోశయ్య తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి వచ్చారని… ఒక దశలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా మారిపోతారని ప్రచారం మొదలవగానే కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లోని ఒక కీలక నేతకు 20 కోట్లు లంచం ఇచ్చి సీఎం పదవి తనకు ఇచ్చేలా సహకరించాలని కోరింది నిజం కాదా అని ప్రశ్నించారు.

20 కోట్లు తీసుకున్న ఆ నేత ఆ తర్వాత టోపి పెట్టారన్నది జగమెరిగిన సత్యమేనని అంబటి రాంబాబు చెప్పారు. పత్రికల్లో రాకపోయినా ఈ విషయం అందరికీ తెలుసన్నారు. కాణిపాకం వచ్చి ముఖ్యమంత్రి పదవి కోసం 20 కోట్లు లంచం ఇవ్వలేదు అని కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని అంబటి ప్రశ్నించారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మొన్నటి ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం పంపిన డబ్బును కొట్టేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. లెక్క చెప్పకపోవడంపై బీజేపీ అధిష్టానం కోపంగా ఉండడంతో తప్పించుకుని తిరుగుతున్నది నిజం కాదా అని నిలదీశారు.

కన్నా లక్ష్మీనారాయణ, సుజనాచౌదరి ఇద్దరూ బీజేపీలో ఉంటూ టీడీపీ కోవర్టులుగా పనిచేస్తున్నారని అంబటి విమర్శించారు. సీఎం పదవి కోసం గతంలో ఢిల్లీలోని ఒక బ్రోకర్‌కు 20 కోట్లు ఇచ్చి పొగొట్టుకున్న కన్నా లక్ష్మీనారాయణ… తిరిగి అదే ఢిల్లీలో సుజనాచౌదరి సాయంతో చంద్రబాబు నుంచి లోటు పూడ్చుకున్నారని అంబటి చెప్పారు.

First Published:  21 April 2020 7:14 AM GMT
Next Story