Telugu Global
NEWS

బోండా ఉమాకు హైకోర్టులో చుక్కెదురు

తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు బోండా ఉమాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తనపై విజయం సాధించిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ బోండా ఉమా హైకోర్టును ఆశ్రయించారు. పదిహేను రోజుల క్రితం బోండా ఉమ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ పిటీషన్ దాఖలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గతంలో బోండా ఉమ తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. ఈసారి […]

బోండా ఉమాకు హైకోర్టులో చుక్కెదురు
X

తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు బోండా ఉమాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తనపై విజయం సాధించిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ బోండా ఉమా హైకోర్టును ఆశ్రయించారు.

పదిహేను రోజుల క్రితం బోండా ఉమ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ పిటీషన్ దాఖలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గతంలో బోండా ఉమ తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. ఈసారి ఆయన వై.ఎస్. ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మల్లాది విష్ణు చేతిలో తక్కువ మెజార్టీతోనే ఓటమి పాలయ్యారు.

పోలైన ఓట్లలో తక్కువ తేడా ఉండడంతో బోండా ఉమా దింపుడు కళ్లెం ఆశతో హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎంలను సరిగా లెక్కించలేదని, పోస్టల్ బ్యాలెట్లను కూడా తిరిగి లెక్కించాలంటూ బోండా ఉమా హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటీషన్ పై వాదనలు విన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం నాడు తన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో మల్లాది విష్ణు ఎన్నిక సక్రమమైనదేనని పేర్కొంటూ బోండా ఉమా పిటీషన్ ను తిరస్కరించింది.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీలో చేరడం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన అక్రమ కట్టడాలపై నూతన ప్రభుత్వం సీరియస్ నిర్ణయాలు తీసుకోవడం ఆ పార్టీని ఇబ్బందుల పాలు చేస్తోంది.

ఇప్పుడు తమ పార్టీ మాజీ శాసనసభ్యుడి పిటీషన్ ను కూడా హైకోర్టు తిరస్కరించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడుపడడం లేదు.

మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నాయకులు ఇటీవల కాకినాడలో రహస్యంగా జరిపిన సమావేశానికి బోండా ఉమా కూడా హాజరయ్యారు. ఆయన కూడా ఇతర కాపు నాయకులతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.

శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాపు నాయకులతో నిర్వహించిన సమావేశంలో హాజరుకావడంపై కూడా బోండా ఉమా అంతగా ఆసక్తి చూపలేదని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో రాజకీయంగా బోండా ఉమాకు ఇది పెద్ద ఎదురుదెబ్బేఅని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  28 Jun 2019 8:43 PM GMT
Next Story