Telugu Global
NEWS

జేసీ సోదరులపై సైన్యాధిపతి తిరుగుబాటు...

జేసీ సోదరులపై ముఖ్య అనుచరులు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఓటమి లేకుండా గెలుస్తూ వస్తున్న జేసీ కుటుంబం కీలక అనుచరుల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే తాడిపత్రిలో పలువురు కీలక టీడీపీ నేతలు జేసీ కుటుంబ ఒత్తిళ్లను తట్టుకోలేక తిరుగుబాటు చేశారు. తాజాగా సీనియర్ నేత భోగాతి నారాయణరెడ్డి జేసీ కుటుంబానికి ఎదురుతిరగడం చర్చనీయాంశమైంది. ఎప్పటి నుంచో భోగాతి నారాయణరెడ్డి జేసీ కుటుంబానికి కీలక అనుచరుడిగా ఉంటూ వచ్చారు. ఒక విధంగా జేసీ అనుచరగణానికి భోగాతి నారాయణరెడ్డిని సైన్యాధిపతిగా […]

జేసీ సోదరులపై సైన్యాధిపతి తిరుగుబాటు...
X

జేసీ సోదరులపై ముఖ్య అనుచరులు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఓటమి లేకుండా గెలుస్తూ వస్తున్న జేసీ కుటుంబం కీలక అనుచరుల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే తాడిపత్రిలో పలువురు కీలక టీడీపీ నేతలు జేసీ కుటుంబ ఒత్తిళ్లను తట్టుకోలేక తిరుగుబాటు చేశారు.

తాజాగా సీనియర్ నేత భోగాతి నారాయణరెడ్డి జేసీ కుటుంబానికి ఎదురుతిరగడం చర్చనీయాంశమైంది. ఎప్పటి నుంచో భోగాతి నారాయణరెడ్డి జేసీ కుటుంబానికి కీలక అనుచరుడిగా ఉంటూ వచ్చారు. ఒక విధంగా జేసీ అనుచరగణానికి భోగాతి నారాయణరెడ్డిని సైన్యాధిపతిగా భావిస్తుంటారు. ఇప్పుడు ఆయనే తిరుగుబాటు చేయడం జేసీ అనుచరులను ఆలోచనలో పడేస్తోంది.

గత కొద్ది రోజులుగా నారాయణరెడ్డి తన మకాంను తాడిపత్రి నుంచి తన సొంతూరుకు మార్చేశారు. వారం కిత్రం తన గ్రామంలో జరిగిన ఆలయ వార్షికోత్సవానికి కూడా జేసీ బ్రదర్స్‌ను ఆహ్వానించలేదు. ఇటీవల ఒక విషయంలో భోగాతి నారాయణరెడ్డిని
జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీవ్రంగా దూషించారని చెబుతున్నారు.

ఆ సమయంలో నారాయణరెడ్డి కూడా ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అప్పటి నుంచి నారాయణరెడ్డి జేసీ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. తాడిపత్రి నుంచి తన సొంతూరుకు మారిపోయాడు.

యల్లనూరు మండలంలో నారాయణరెడ్డి అత్యంత బలమైన నాయకుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం యల్లనూరులో జేసీ సోదరులు వారి కుమారులు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఆ కార్యక్రమానికి భోగాతి నారాయణరెడ్డి హాజరుకాకపోవడంతో వారి మధ్య పూర్తి స్థాయిలో గ్యాప్‌ వచ్చినట్టు భావిస్తున్నారు. ఒక దశలో జేసీ దివాకర్ రెడ్డి జోక్యం చేసుకుని భోగాతినారాయణ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా…. జేసీ ప్రభాకర్‌ రెడ్డి అడ్డుపడ్డారని చెబుతున్నారు.

జేసీ కుటుంబానికి పూర్తి దూరంగా జరిగిన నారాయణరెడ్డి… వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఆయన వైసీపీలోకి వస్తే యల్లనూరు మండలంలో ఓటింగ్‌ వైసీపీకి ఏకపక్షంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అయితే చాలా కాలంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గానికి, భోగాతి నారాయణరెడ్డికి మధ్య వార్‌ నడుస్తోంది. ఈనేపథ్యంలో పెద్దారెడ్డి స్పందనను బట్టే భోగాతి నారాయణరెడ్డి వైసీపీలోకి చేరడం ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.

మొత్తం మీద ఇటీవల జేసీ సోదరులు వరుసగా పలువురు కీలకనేతలను దూరం చేసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో జేసీ దివాకర్ రెడ్డి సర్దుకుపోయేందుకు సిద్ధమవుతున్నా ప్రభాకర్ రెడ్డి మాత్రం పట్టింపులకు పోతున్నారన్న అభిప్రాయం ఉంది.

First Published:  24 Feb 2019 11:30 PM GMT
Next Story