మన పిల్లలకు తెలుగు తలకెక్కడం లేదు... ఎన్సిఇఆర్టి సర్వే తేల్చిన నిజం!
తెలంగాణలో పదవతరగతి చదువుతున్న విద్యార్థులు తెలుగులో చాలా వెనుక బడి ఉన్నారని ఓ సర్వేలో తేలింది. మిగిలిన సబ్జక్టులతో పోల్చి చూస్తే తెలుగు పాఠాలు వారికి ఏమాత్రం బుర్రకెక్కడం లేదని ఈ సర్వే చెబుతోంది. మానవ వనరుల మంత్రిత్వ శాఖ తరపున ఈ సర్వేని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 148 స్కూళ్ల నుండి 5,040మంది విద్యార్థులను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. ఇంగ్లీషు, లెక్కలు, సైన్స్, సోషల్, ఆధునిక భారతీయ […]
తెలంగాణలో పదవతరగతి చదువుతున్న విద్యార్థులు తెలుగులో చాలా వెనుక బడి ఉన్నారని ఓ సర్వేలో తేలింది. మిగిలిన సబ్జక్టులతో పోల్చి చూస్తే తెలుగు పాఠాలు వారికి ఏమాత్రం బుర్రకెక్కడం లేదని ఈ సర్వే చెబుతోంది. మానవ వనరుల మంత్రిత్వ శాఖ తరపున ఈ సర్వేని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 148 స్కూళ్ల నుండి 5,040మంది విద్యార్థులను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. ఇంగ్లీషు, లెక్కలు, సైన్స్, సోషల్, ఆధునిక భారతీయ భాషల్లో పిల్లలకు ఉన్న తెలివితేటలను పరిశీలించారు.
ఈ ఏడాది 9, 10 తరగతులకు ప్రాచీన, ఆధునిక సాహిత్యంపై పాఠాలను తెలుగులో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్న తరుణంలో ఈ సర్వే వెలువడి, తెలుగులో పిల్లల తెలివితేటలను బయటపెట్టింది. సబ్జక్టుపై అత్యధిక పట్టు ఉంటే 400 మార్కులు, అత్యల్పంగా పట్టు ఉంటే 100 మార్కులగానూ, సగటు 250గానూ భావించగా… పిల్లలు తెలుగులో సగటుకంటే తక్కువగా 235 మార్కులు సాధించారు. ఇంగ్లీషులో 245, సైన్స్ 247 మార్కులతో ఈ రెండు సబ్జక్టుల్లోనూ సగటు కంటే వెనుకబడి ఉన్నారు. లెక్కలు, సోషల్లో మాత్రం 260, 263 స్కోరుతో కాస్త ముందున్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు టీచర్ల సంఖ్య తక్కువగా ఉండటమే ఈ ఫలితాలకు కారణమని విద్యా కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. హైస్కూలు టీచర్ల విషయానికి వస్తే ఒక్కొక్క టీచరుపై 300 మంది విద్యార్థుల భారం పడుతున్నదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో 3వేల తెలుగు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే తెలుగులో పిల్లల తెలివితేటలు గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ కూడా తక్కువగానే ఉన్నాయి. ఇందులో మగపిల్లల కంటే ఆడపిల్లలు కాస్త మెరుగ్గా ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలతో పోలిస్తే ప్రయివేటు స్కూళ్లు ఈ విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నాయని సర్వేలో తేలింది. ఈ స్కూళ్లలో తెలుగులో పిల్లల సగటు తెలివితేటల స్కోరు 269గా ఉంది. 32.8శాతం మంది విద్యార్థులు తెలుగు సబ్జక్టు పరంగా మరింతగా మెరుగుపడాల్సి ఉండగా, 20.5 శాతం మంది పిల్లల విషయంలో ఈ కృషి మరింత గట్టిగా జరగాల్సి ఉందని సర్వే తేల్చింది. మొత్తం మీద చూస్తే రాష్ట్రవ్యాప్తంగా తెలుగులో 300 మించిన సగటుని సాధించిన విద్యార్థులు 4.6శాతం మాత్రమే ఉన్నారు. ఈ ఫలితాలను బట్టి చూస్తుంటే మన రాష్ట్రంలో ప్రాథమిక విద్య విషయంలో అనేక మార్పులు చేయాల్సి ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.