Telugu Global
NEWS

తూచ్‌.. కోటి ఎక‌రాల ప్లాన్‌ మాదే!

తెలంగాణ‌లో కోటి ఎక‌రాల‌కు సాగునీరివ్వాల‌న్న ప్లాన్ త‌మ‌దేన‌ని కాంగ్రెస్ వాదిస్తోంది. త‌మ హ‌యాంలోనే కోటి ఎక‌రాల‌కు సాగునీరు ఇచ్చేందుకు సర్వం సిద్ధ‌మయ్యాయ‌ని, ఇందులో  కేసీఆర్ కొత్త‌గా చేసిందేమీ లేద‌ని చెబుతోంది. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు కేసీఆర్ ఇచ్చిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌కు దీటుగా.. కాంగ్రెస్ వారు కూడా ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. 2004 త‌రువాత వైఎస్ హ‌యాంలో తెలంగాణలో 33 ప్రాజెక్టులు చేప‌ట్టామ‌ని,  వీటిలో 18 భారీ, 12 మ‌ధ్య‌త‌ర‌హా, రెండు ప్రాజెక్టుల ఆధునీక‌ర‌ణ‌, మ‌రో […]

తూచ్‌.. కోటి ఎక‌రాల ప్లాన్‌ మాదే!
X
తెలంగాణ‌లో కోటి ఎక‌రాల‌కు సాగునీరివ్వాల‌న్న ప్లాన్ త‌మ‌దేన‌ని కాంగ్రెస్ వాదిస్తోంది. త‌మ హ‌యాంలోనే కోటి ఎక‌రాల‌కు సాగునీరు ఇచ్చేందుకు సర్వం సిద్ధ‌మయ్యాయ‌ని, ఇందులో కేసీఆర్ కొత్త‌గా చేసిందేమీ లేద‌ని చెబుతోంది. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు కేసీఆర్ ఇచ్చిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌కు దీటుగా.. కాంగ్రెస్ వారు కూడా ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. 2004 త‌రువాత వైఎస్ హ‌యాంలో తెలంగాణలో 33 ప్రాజెక్టులు చేప‌ట్టామ‌ని, వీటిలో 18 భారీ, 12 మ‌ధ్య‌త‌ర‌హా, రెండు ప్రాజెక్టుల ఆధునీక‌ర‌ణ‌, మ‌రో ఫ్ల‌డ్ బ్యాంకు ఉన్నాయ‌ని గుర్తు చేశారు. వీటి ద్వారా అప్ప‌ట్లోనే మొత్తం 50 ల‌క్ష‌ల ఎక‌రాల కొత్త ఆయ‌క‌ట్టుకు నీరిచ్చేందుకు ప్ర‌య‌త్నాలు 12 ఏళ్ల కిందే మొద‌ల‌య్యాయ‌ని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని స‌మ‌ర్ధంగా వివ‌రించేందుకు ప‌వర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌కు సిద్ధ‌మ‌వుతున్నామ‌ని తెలిపారు. కాళేశ్వ‌రం, పాల‌మూరు ప్రాజెక్టుల ఆవ‌శ్య‌త‌క ఎంత‌? అన్న‌దానిపైనా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్లో చ‌ర్చించ‌నున్నారు.
వాస్త‌వానికి కాంగ్రెస్ 2004లో ఉమ్మ‌డిఏపీలో ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద‌పీట వేసిన మాట వాస్త‌వం. వాటిలో చాలామ‌టుకు తుదిద‌శ‌కు వ‌చ్చాయి. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మ‌రింత నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ఉండాలంటూ కొన్ని ప్రాజెక్టుల‌కు రీడిజైనింగ్‌, మ‌రికొన్ని కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆధ్వ‌ర్యంలోని స‌ర్కారు నిర్ణ‌యించింది. ఈ విష‌యంలో స‌ర్కారు తీరును ఎండ‌గ‌ట్టేందుకు కాంగ్రెస్ పుష్క‌లంగా అవ‌కాశాలున్నా.. వాటిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోతున్నార‌ని విమ‌ర్శ‌కులు చెబుతున్నారు. కేసీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ను బ‌హిష్క‌రించిన కాంగ్రెస్ నేత‌ల్లో భిన్న‌స్వ‌రాలు వినిపించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు. కేసీఆర్ కు దీటుగా పవ‌ర్‌పాయింట్ ప్రజెంటేష‌న్ ఇద్దామ‌నుకున్నా.. ఇంత‌వ‌ర‌కూ అది సాధ్యం కాలేదు. ఈ విష‌యాన్ని ఉత్త‌మ్ వేస‌విలో ప్ర‌క‌టించ‌గా.. జూలై ముగుస్తున్నా.. ఎప్పుడు అన్న‌ది స్ప‌ష్టంగా ప్ర‌క‌టించ‌లేదు.
ఇప్ప‌టికైనా కాంగ్రెస్ నేత‌లు సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో ఐక్యంగా పోరాడితే.. క‌నీసం గ‌తంలో కాంగ్రెస్ చేసుకున్న ప‌నుల‌కైనా గుర్తింపు ద‌క్కుతుందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ను స‌మ‌ర్ధంగా ఇవ్వ‌గ‌లిగితే.. స‌గం స‌ఫ‌లీకృత‌మైన‌ట్లేన‌ని చెబుతున్నారు. అప్పుడు కాంగ్రెస్ నేత‌ల పోరాటాల‌కు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. తూతూ మంత్రంగా ఇస్తే మాత్రం భంగ‌పాటు త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టంచేస్తున్నారు.
First Published:  19 July 2016 9:00 PM GMT
Next Story