Telugu Global
Others

విశాఖపై రాయపాటి అనుచిత వ్యాఖ్యలు- ఎంపీల వాగ్వాదం

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు విశాఖపట్నాన్ని తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. విజయవాడలో రైల్వే జీఎంతో జరిగిన ఎంపీల సమావేశం అనంతరం రాయపాటి వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వే జోన్‌ కోసం ఉత్తరాంధ్ర ఎంపీలు సమావేశంలో డిమాండ్ చేయగా రాయపాటి జోక్యం చేసుకున్నారు. తుపాన్లు ముంచెత్తే విశాఖకు రైల్వే జోన్ అవసరమా అని వ్యాఖ్యానించి అందరూ షాక్ అయ్యేలా చేశారు. సొంత రాష్ట్ర ఎంపీయే ఇలా అనే సరికి ఎంపీలంతా కాసేపు కంగుతిన్నారు. తేరుకున్న ఉత్తరాంధ్ర […]

విశాఖపై రాయపాటి అనుచిత వ్యాఖ్యలు- ఎంపీల వాగ్వాదం
X

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు విశాఖపట్నాన్ని తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. విజయవాడలో రైల్వే జీఎంతో జరిగిన ఎంపీల సమావేశం అనంతరం రాయపాటి వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వే జోన్‌ కోసం ఉత్తరాంధ్ర ఎంపీలు సమావేశంలో డిమాండ్ చేయగా రాయపాటి జోక్యం చేసుకున్నారు. తుపాన్లు ముంచెత్తే విశాఖకు రైల్వే జోన్ అవసరమా అని వ్యాఖ్యానించి అందరూ షాక్ అయ్యేలా చేశారు. సొంత రాష్ట్ర ఎంపీయే ఇలా అనే సరికి ఎంపీలంతా కాసేపు కంగుతిన్నారు. తేరుకున్న ఉత్తరాంధ్ర ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, అవంతి శ్రీనివాస్‌లు రాయపాటిపై తీవ్రంగా స్పందించారు.

తుపాన్ల పేరు చెప్పి రైల్వేజోన్‌ను కూడా ఎగురేసుకుపోదామనుకుంటున్నారా, ఏం మాట్లాడుతున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ తరచూ తుపాన్లు వస్తున్నాయి అంత మాత్రమే అక్కడ రాజధాని కట్టవద్దని మేం అభ్యంతరం చెప్పామా అని నిలదీశారు. బాధ్యతగా మాట్లాడండి అని హితవు పలికారు. వివాదం పెద్దదవుతుందని భావించిన ఇతర ఎంపీలు జోక్యం చేసుకుని ఎంపీలను శాంతింపజేశారు. రాయపాటి వ్యాఖ్యలపై ఉత్తరాంధ్రవాసులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాయపాటి అహంకారానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని మండిపడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలంటే ఎందుకంత చిన్నచూపు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా సీనియర్‌ ఎంపీ అయి ఉండి ఒక ప్రాంతాన్ని కించపరిచేలా రాయపాటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ హర్శించరు.

First Published:  7 Jan 2016 11:19 AM GMT
Next Story