Telugu Global
Others

రన్ వే మీదకి పందులు!

కొంతకాలంగా భారత్లోని ఎయిర్పోర్టుల్లో రన్వేలపైకి గేదెలు, పందుల పరుగులు పెడుతూ.. విమాన ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి.  గతేడాది గుజరాత్లోని ఓ విమానాశ్రయంలో రన్ వే పైకి గేదె రాగా, తాజాగా నాగ్పూర్ ఎయిర్పోర్టులో పందుల గుంపు ఒకటి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. సోమవారం రాష్ర్టపతి రెండురోజుల పర్యటన నిమిత్తం నాగ్ పూర్ కు వచ్చారు.  ఆయన ప్రయాణించిన బోయింగ్-737 విమానం నాగ్ పూర్ లోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయి టెర్మినల్ బిల్డింగ్ వైపు వెళుతుండగా.. దాదాపు […]

రన్ వే మీదకి పందులు!
X
కొంతకాలంగా భారత్లోని ఎయిర్పోర్టుల్లో రన్వేలపైకి గేదెలు, పందుల పరుగులు పెడుతూ.. విమాన ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. గతేడాది గుజరాత్లోని ఓ విమానాశ్రయంలో రన్ వే పైకి గేదె రాగా, తాజాగా నాగ్పూర్ ఎయిర్పోర్టులో పందుల గుంపు ఒకటి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. సోమవారం రాష్ర్టపతి రెండురోజుల పర్యటన నిమిత్తం నాగ్ పూర్ కు వచ్చారు. ఆయన ప్రయాణించిన బోయింగ్-737 విమానం నాగ్ పూర్ లోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయి టెర్మినల్ బిల్డింగ్ వైపు వెళుతుండగా.. దాదాపు 8 పందులతో కూడిన‌ గుంపు హఠాత్తుగా రన్వేపై ప్రత్యక్షమైంది. ఇది గమనించిన అధికారులు పరుగుపరుగున వెళ్లి వాటిని తరిమేశారు. రాష్ర్టపతి విమానం ల్యాండ్ అయ్యాక ఇవి వచ్చాయి కాబట్టి సరిపోయింది.. కాస్త ముందు వచ్చి ఉంటే.. పెద్ద‌ ప్రమాదమే జరిగి ఉండేది. అందుకే డీజీసీఏ ఈ ఘటనను తీవ్రంగా తీసుకుని విచారణకు ఆదేశించింది. 2014, నవంబరు 7న గుజరాత్లోని సూరత్ ఎయిర్పోర్టులో స్పైస్ జెట్ బోయింగ్-737 విమానం రన్వే పైనున్న గేదెను ఢీకొట్టిన విషయం తెలిసిందే! ఈ ఘటనలో విమానం ఇంజిన్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరగలేదు. మొత్తానికి రన్వే పైకి జంతువులు రావడం ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
First Published:  15 Sep 2015 8:46 PM GMT
Next Story