Telugu Global
Others

హ‌స్యాస్ప‌దంగా మారిన ప‌ట్టిసీమ‌

ప‌నులు కాకుండానే జాతికి అంకితం.. గ‌డువుపై చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల ఫ‌లితం.. బ‌హుళార్థ సాథ‌క జాతీయ ప్రాజెక్టు పోల‌వ‌రంను తోసిరాజ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ల‌కెత్తుకున్నప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం హాస్యాస్ప‌దంగా మారిపోయింది. ఏడాది గ‌డువులో ప్రాజెక్టును క‌ట్టి చూపిస్తామ‌ని స‌వాలు చేసిన చంద్ర‌బాబు నాయుడు ఆ మాట నిల‌బెట్టుకోవ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతున్నారు. ఆ గ‌డువు ఈ నెల 15తో ముగుస్తోంది. ఆగ‌స్టు 15 నాటికి ఎలాగైనా స‌రే ప్రాజెక్టును పూర్తి చేయ‌డం కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా ఇంకా ప‌నులేవీ పూర్తి […]

హ‌స్యాస్ప‌దంగా మారిన ప‌ట్టిసీమ‌
X
ప‌నులు కాకుండానే జాతికి అంకితం.. గ‌డువుపై చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల ఫ‌లితం..
బ‌హుళార్థ సాథ‌క జాతీయ ప్రాజెక్టు పోల‌వ‌రంను తోసిరాజ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ల‌కెత్తుకున్నప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం హాస్యాస్ప‌దంగా మారిపోయింది. ఏడాది గ‌డువులో ప్రాజెక్టును క‌ట్టి చూపిస్తామ‌ని స‌వాలు చేసిన చంద్ర‌బాబు నాయుడు ఆ మాట నిల‌బెట్టుకోవ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతున్నారు. ఆ గ‌డువు ఈ నెల 15తో ముగుస్తోంది. ఆగ‌స్టు 15 నాటికి ఎలాగైనా స‌రే ప్రాజెక్టును పూర్తి చేయ‌డం కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా ఇంకా ప‌నులేవీ పూర్తి కాలేదు. అయిన‌ప్ప‌టికీ ప‌రువు నిల‌వాలంటే ఆగ‌స్టు 15న ప్రాజెక్టును ప్రారంభించాల్సిందేన‌ని ముఖ్య‌మంత్రి భీష్మించ‌డంతో ఏం చేయాలో తోచ‌క అధికారులు త‌ల‌లు ప‌ట్టుకు కూర్చున్నారు. ఈ ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో మొత్తం 24 పంపులున్నాయి. వాటిలో క‌నీసం రెండింటినైనా పూర్తి చేస్తే కార్య‌క్ర‌మాన్ని అట్ట‌హాసంగా ధూంధాం అనిపిద్దామ‌ని ముఖ్య‌మంత్రి త‌ల‌పోశారు. కానీ ఆ రెండు కూడా పూర్తి కాలేదు. పంప్‌హౌస్‌ నుండి కుడికాలువ పనుల వరకూ ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదు. రెండు పంపులు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెబుతున్నా ప్రాజెక్టు వద్ద అటువంటి స్థితి కనిపించడంలేదు. పంపుహౌస్‌ వద్ద ఏర్పాటు చేసే మోటర్లు విదేశాల నుంచి రావ‌ల‌సి ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. అవి ఇంకా చేరుకోకుండానే ఎత్తిపోత‌లు ఎలా సాధ్య‌మో ముఖ్య‌మంత్రికే తెలియాలి. సెప్టెంబర్‌ 1కి రెండు పంపులు పూర్తయ్యే అవ‌కాశాలున్నాయ‌ని అధికారులు అంటున్నా అదీ అనుమాన‌మే. మరోవైపు కుడికాలువ పనులు సైతం ఎక్కడికక్కడే అసంపూర్తిగా ఉన్నాయి. దేవరపల్లి వద్ద ఇంకా మూడు లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించాల్సి ఉంది. ఈ పనులు రాత్రీపగలు చేసినా మరో 15 రోజులు పట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇక పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మిస్తున్న టన్నెల్‌ సగం కూడా పూర్తికాలేదు. ఒక్క పశ్చిమలోనే 20 చోట్ల రోడ్డు క్రాసింగ్‌లకు తూములు పెట్టాల్సి ఉన్నా.. అవీ పూర్తయిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా ఆగ‌స్టు 15న ప‌ట్టిసీమ‌కు ముఖ్య‌మంత్రి వ‌స్తున్నార‌ని, ఆరోజున ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం ఉంటుంద‌ని ఇరిగేష‌న్ శాఖ మంత్రి దేవినేని ఉమ చెబుతున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం అంటే రెండు గెడ‌క‌ర్ర‌లు పాతి రిబ్బ‌న్ క‌ట్టి దానిని క‌ట్ చేయ‌డ‌మ‌నుకుంటున్నారో ఏమిటో అని అధికారులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇరిగేష‌న్ మంత్రికి అస‌లు విష‌యం తెలియ‌క‌పోయినా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్నారు. ఆయ‌న ఎక్క‌డా ప‌ట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభిస్తాం అని చెప్ప‌డం లేదు.. ఆగ‌స్టు 15న ప‌ట్టిసీమ‌ను జాతికి అంకితం చేస్తామ‌ని మాత్ర‌మే ఆయ‌న చెబుతున్నారు.
First Published:  13 Aug 2015 9:22 PM GMT
Next Story