Telugu Global
Others

మంత్రి త‌ల‌సాని టీడీపీ ఎమ్మెల్యేనా?... రాష్ట్రప‌తి ఆశ్చ‌ర్యం!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ టీడీపీ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వర్షాకాల విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతిని టీ టీడీపీ నేతలు ప్రత్యేకంగా కలిశారు. టి.టీడీపీ నేతలు ఎల్‌. రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి తదితరులు రాష్ట్రపతిని కలిసి పార్టీ ఫిరాయింపులపై మెమోరాండం అందజేశారు. చ‌ట్టాలు ఉండి కూడా ప్ర‌యోజ‌నం లేకుండా పోతున్నాయ‌ని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా […]

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ టీడీపీ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వర్షాకాల విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతిని టీ టీడీపీ నేతలు ప్రత్యేకంగా కలిశారు. టి.టీడీపీ నేతలు ఎల్‌. రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి తదితరులు రాష్ట్రపతిని కలిసి పార్టీ ఫిరాయింపులపై మెమోరాండం అందజేశారు. చ‌ట్టాలు ఉండి కూడా ప్ర‌యోజ‌నం లేకుండా పోతున్నాయ‌ని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా చూడాలని ప్రణబ్‌ను కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గవర్నర్‌ నరసింహన్‌ను కోరినట్లు రాష్ట్రపతికి వివరించారు. మెమోరాండాన్ని పరిశీలించిన రాష్ట్రపతి ఏ పార్టీ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీ టీడీపీ నేతలు వారి పేర్లు చెప్పడంతో.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా కొన‌సాగుతున్న‌ తలసాని టీడీపీ ఎమ్మెల్యేనా? అని రాష్ట్రపతి ప్రత్యేకంగా అడిగి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై… స్పీకర్‌ స్పందన ఏమిటి? అని కూడా రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. మెమోరాండాన్ని కేంద్రంలోని సంబంధిత శాఖకు పంపి… చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తానని టీ టీడీపీ నేతలకు రాష్ట్రపతి హామీ ఇచ్చారు.
First Published:  5 July 2015 1:10 PM GMT
Next Story